
సహజ వ్యవసాయ విస్తరణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం
సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో బయో రిసోర్స్ సెంటర్ల పాత్ర కీలకం
కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కల్లూరు/ కర్నూలు ప్రతినిధి, జనవరి 02, (సీమకిరణం న్యూస్) :
సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో బయో రిసోర్స్ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. శుక్రవారం కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో సహజ వ్యవసాయం జాతీయ మిషన్ సహకారంతో ఏర్పాటు చేసిన బయో రిసోర్స్ సెంటర్ ను జిల్లా కలెక్టర్, పాణ్యం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సహజ వ్యవసాయం జాతీయ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలో సహజ వ్యవసాయ విస్తరణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. బయో రిసోర్స్ సెంటర్ల ద్వారా జీవామృతం, ఘనజీవామృతం, దశపర్ణి కషాయం వంటి సహజ ఎరువులను స్థానికంగా తయారు చేసి అందిస్తాయని తెలిపారు. సహజ వ్యవసాయం ద్వారా వ్యవసాయంలో ఖర్చులు తగ్గి, నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడకుండా ప్రకృతి సిద్ధమైన విధానాలను అవలంబించి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తికి, పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయాలని కలెక్టర్ రైతులకు సూచించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు దీర్ఘకాలిక లాభాలు చేకూర్చే విధంగా పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఈ బయో రిసోర్స్ సెంటర్ ద్వారా రైతులు స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందడుగు పడుతుందన్నారు. సహజ వ్యవసాయ విధానాలను అవలంబించి పర్యావరణ పరిరక్షణతో పాటు స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు, తడకనపల్లె సర్పంచ్ సహేరాబి, కల్లూరు మండల సమాఖ్య అధ్యక్షురాలు ఎస్.జుబేదాబి, తదితరులు పాల్గొన్నారు.




