ఇద్దరిపై జిల్లా బహిష్కరణ ఉత్తర్వుల జారీ

ఇద్దరిపై జిల్లా బహిష్కరణ ఉత్తర్వుల జారీ
కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ A. సిరి
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైమ్, డిసెంబర్ 11, (సీమకిరణం న్యూస్):
కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో షరీన్ నగర్ నందు నివాసముండే కిరాయి హంతకుడు షీట్ No. 1 అయిన వడ్డే రామాంజనేయులు @ వడ్డే అంజి మరియు సస్పెక్ట్ షీటర్ 216 అయిన పఠాన్ ఇమ్రాన్ ఖాన్ అనే ఈ ఇద్దరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అలవాటు పడిన వీరి ఇద్దరి పై కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ A. సిరి జిల్లా బహిష్కరణ ఉత్తర్వులను జారీ చేశారు. కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు వడ్డే రామాంజినేయులు @ వడ్డే అంజి మీద జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో 17 కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో హత్యలు, దోపిడీలు, ఎస్సీ ఎస్టీ వర్గాల మీద దాడులు, జులుం కేసులు, హత్యాయత్నం కేసులు ఇలా పలు రకాల కేసులు నమోదయి ఉన్నాయి. అదే విధంగా మరొక వ్యక్తి అయిన పఠాన్ ఇమ్రాన్ ఖాన్ మీద కూడా సుమారు 19 క్రిమినల్ కేసుల్లో నిందితుడు గా ఉన్నాడు. పలుమార్లు వీరి పై తెలిపిన కేసుల్లో రిమాండ్కు వెళ్లినా కూడా వారిలో ఎటువంటి మార్పు రాకపోవడం, మరియు అదేవిధంగా 2022 వ సంవత్సరంలో వీరిద్దరూ కూడా పీడీ యాక్ట్ నిర్భంద ఉత్తర్వుల కింద కడప సెంట్రల్ జైల్లో ఖైదు చేయబడినప్పటికీ వీరి ప్రవర్తనలో మార్పు రాకపోగా, తదుపరి కూడా రకరకాల కేసులలో పాల్గొంటున్నారని కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారి యొక్క ప్రతిపాదనల మేరకు వారి ఇద్దరి యొక్క క్రిమినల్ రికార్డు లను నిశితంగా పరిశీలించిన మీదట జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి నిన్నటి రోజున ఇద్దరి మీద జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటినుండి ఎవరైనా రౌడీయిజంతో అరాచక శక్తులుగా మారి , ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలగజేసే విధంగా ప్రవర్తిస్తే అటువంటి వారిపై జిల్లా బహిష్కరణతో పాటుగా పీడి యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించడం జరుగుతుందని, ప్రశాంతంగా, మంచిగా, బుద్ధిగా జీవించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఇటువంటి చెడు నడత కలిగిన వారి పై మరియు ఇంకా కొంత మంది పై కూడా జిల్లా బహిష్కరణ గురించి పరిశీలనలో ఉన్నాయని కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.




