టిడిపి తెలుగు ప్రజల పార్టీ
కర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్
కర్నూలు టౌన్, మార్చి 29, (సీమకిరణం న్యూస్) :
తెలుగుదేశం పార్టీలో ఉండటం అదృష్టంగా భావిస్తానని కర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో నేతలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టి.జి భరత్ మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. తెలుగు రాష్ట్రం బాగుండాలన్న ఉద్దేశంతోనే ఆనాడు ఎన్టీఆర్, చంద్రబాబులు ఎంతో కష్టపడ్డారన్నారు. దేశ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం వచ్చినప్పటికీ వాటిని పక్కనపెట్టి తెలుగు ప్రజల అభివృద్ధి కోసం పాటుపడ్డారన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అంటే గుర్తొచ్చేది ముందుగా చంద్రబాబు పేరే అన్నారు. ప్రజా సేవ చేయాలన్న తపన చంద్రబాబులో ఉందన్నారు. 40 సంవత్సరాల కాలంలో పార్టీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని నిలదొక్కుకుందన్నారు. అంతకుముందు కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 40 ఏళ్ల చరిత్రలో పార్టీ అధికారంలో ఉండటంతో పాటు ప్రతిపక్షంలోనూ ఉందన్నారు. త్వరలో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఇక కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి టి.జి భరత్ ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. టి.జి ఫ్యామిలీ ప్రజలకు మేలు చేసేదన్నారు. సేవ చేసే వారిని ప్రజలు ఎన్నుకోవాలన్నారు. కర్నూలు అభివృద్ధి కావాలంటే ఎమ్మెల్యేగా భరత్ గెలవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్పోరేటర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.