
జన భోజనాలు నవ సమాజ నిర్మాణానికి తొలిమెట్టు కావాలి
కులమతాలకు అతీతంగా జనం భోజనం అభినందనీయం
కర్నూలులో ఆనందోత్సవాల మధ్య జర్నలిస్టుల జన భోజనం
హాజరైన జర్నలిస్టులు, రాజకీయ , ప్రజాప్రతినిధులు
కర్నూలు టౌన్, డిసెంబర్ 09, (సీమకిరణం న్యూస్) :


కులమతాలకు అతీతంగా నిర్వహించిన జన భోజనం నవ సమాజ నిర్మాణానికి తొలిమెట్టు లాంటిదని పలువురు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా కర్నూలులో కులమతాలకు అతీతంగా, జన భోజనం నిర్వహించడం అభినందనీయమని వారు ప్రశంసించారు. శనివారం కర్నూలు నగర శివారులోని కెవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల ఆవరణంలో కులమతాలకు అతీతంగా జర్నలిస్టుల సామూహిక జన భోజన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కర్నూలు నగర మేయర్ బీ వై.రామయ్య, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, ఎమ్మెల్సీ మధుసూదన్ , మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ విజయ మనోహరి , అమీలియో హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీప్రసాద్ ,రెడ్ క్రాస్ అధ్యక్షులు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి ,మైపర్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఆదిమూలపు సతీష్, కెవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కె వి. సుబ్బారెడ్డి లతోపాటు సీనియర్ జర్నలిస్టులు అబ్దుల్ సత్తార్ ,టీ.విజయ్ ,కార్పొరేటర్ పద్మలత రెడ్డి తదితరులు హాజరయ్యారు .ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ కులం ,మతం, వర్గాలుగా విడిపోతున్న నేటి సమాజంలో అన్ని కులమతాల వారిని ఒకే వేదికపై తెచ్చే విధంగా జర్నలిస్టు సోదరులు జన భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. సామాజిక దృక్పథంతో ఏర్పాటు చేసిన ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఐక్య మత్యం, స్నేహభావం ఏర్పడడానికి దోహదపడతాయని తెలిపారు. టెక్నాలజీ పెరిగి మానవ సంబంధాలు అంతరించిపోతున్న నేపథ్యంలో సామూహిక జన భోజనాలు స్నేహబంధాలు పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని కార్యక్రమానికి హాజరైన వక్తలు చెప్పారు. మానవులంతా ఒక్కటే మనమంతా భారతీయులం అని చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమంలో అన్ని కుల ,మతాలకు చెందిన జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ ప్రముఖులు, ప్రజలు విద్యావంతులు హాజరై ఆనందోత్సాహాల మధ్య ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహం గా సామూహిక జనభోజనంలో పాల్గొని విందు భోజనం ఆరగించారు .ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులకు సీనియర్ జర్నలిస్టులు అబ్దుల్ సత్తార్, విజయ్ ల సారథ్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జర్నలిస్ట్ సోదరులు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.