
దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలి
ప్రత్యేక ఇఫ్తార్ ప్రార్థనల్లో పాల్గొన్న మాజీ ఎంపీ మేకపాటి
నెల్లూరు, మర్రిపాడు, మార్చి 25, (సీమకిరణం న్యూస్) :
రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం మర్రిపాడు మండలం కృష్ణాపురం బీసీకాలనీలోని మసీదులో ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీం సోదరులతో కలసి నిర్వహించిన ప్రత్యేక దువా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదరసోదరీమణులంతా నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో నిష్టగా అల్లాను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారని తెలియజేశారు. సర్వమానవాళికి అల్లా రక్షణ, కరుణ పొందాలనే లక్ష్యంతో రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని, ప్రతి ఒక్కరూ ఉన్నదానిలో ఎంతోకొంత దానధర్మాలు చేస్తారని, సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంటుందని తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.