
ఓటు వేయడం మీ హక్కే కాదు, మీ బాధ్యత కూడా
ఓటు అనే రెండక్షరాలు దేశ చరిత్రనే మార్చేస్తుంది
ప్రజాస్వామ్యానికి ఓటే పునాది
జిల్లా కలెక్టర్ డా జి.సృజన
కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 12, (సీమకిరణం న్యూస్):
జిల్లా ప్రజలందరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఓటు అనే రెండక్షరాలు దేశ చరిత్రనే మార్చేస్తుందని, ఓటు వేయడం మీ హక్కు మాత్రమే కాదని, మీ బాధ్యత కూడా అని జిల్లా కలెక్టర్ డా జి.సృజన పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణంలో కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, కర్నూలు రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వీప్ కార్యకలాపాలలో భాగంగా “నేను తప్పక ఓటు వేస్తాను” అనే స్లోగన్ తో పాటు “మోడల్ ఈవిఎమ్” ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ తో కలిసి జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ స్థితిగతులను మార్చే శక్తి ఒక ఓటుకు మాత్రమే ఉందని, అటువంటి ఓటు హక్కును జిల్లా ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి తెలిసిన ప్రజలు ఇంట్లో కూర్చుంటే ఏమి తెలియని వాళ్ళు రాజ్యం ఏలుతారని, అందుకే భారత ప్రజాస్వామ్య పరిరక్షణకోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి ఓటు వేయాలన్నారు. తొలుత కలెక్టర్ “నేను ఓటు వేస్తాను అనే ప్రతిజ్ఞ” కు సంబంధించిన సిగ్నేచర్ క్యాంపెయిన్ బోర్డ్ ను ఆవిష్కరించి సంతకం చేశారు..అక్కడే ఏర్పాటు చేసిన ఫోటో బోర్డు లో నేను ఓటరుగా గర్విస్తున్నాను అనే స్టాండ్ దగ్గర కలెక్టర్ ఫోటో దిగారు. తదనంతరం “I Vote For Sure” అనే ఎయిర్ బెలూన్ ను జిల్లా ఎస్పీ తో కలిసి కలెక్టర్ ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, కర్నూలు మున్సిపల్ కమీషనర్ భార్గవ తేజ, ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.