
రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
20 పడకల నూతన క్యాజువాలిటీ వార్డ్ ను వెంటనే ప్రారంభించండి
గైనిక్ వార్డ్ ను 300 పడకలకు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి
ఆస్పత్రి అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాం
కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామానికి చెందిన చిన్నారులను పరామర్శించిన కలెక్టర్
కర్నూలు ప్రతినిధి, జూలై 20, (సీమకిరణం న్యూస్) :




ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా వైద్యాధికారులను ఆదేశించారు.
శనివారం స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపి కౌంటర్, క్యాజువాలిటీ, ఏఎంసి, రక్త నిధి కేంద్రం, డయాగ్నోస్టిక్ బ్లాక్, ఐసోలేషన్ వార్డ్, ప్రసూతి విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. తొలుత ఓపి విభాగాన్ని పరిశీలిస్తూ రోజుకు ఎన్ని ఓపి లు ఇస్తున్నారు, ఎన్ని కౌంటర్లు నడుస్తున్నాయి అని కలెక్టర్ ఆసుపత్రి సూపరిoటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. రోజుకు 3 వేలు ఓపి ఉంటుందని, 10 కౌంటర్లు నడుస్తున్నాయని ఆసుపత్రి సూపరిoటెండెంట్ కలెక్టర్ కు వివరించారు. విభిన్న ప్రతిభావంతులకు, చిన్నపిల్లల తల్లులకు ఓపిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సూపరిoటెండెంట్ ను కలెక్టర్ ఆదేశించారు. ఓపి తీసుకున్న వారు వారికి కేటాయించిన వార్డ్ ఎక్కడుందని తెలుసుకునేందుకు వీలుగా సైన్ బోర్డు లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏ బ్లాక్ లో ఏ వార్డులు, ఏ అంతస్తులో ఉన్నాయనే వివరాలను మ్యాప్ రూపంలో రూపొందించి ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం క్యాజువాలిటీ విభాగాన్ని పరిశీలించారు. వైద్యం పొందుతున్న రోగులతో కలెక్టర్ మాట్లాడారు. డాక్టర్లు బాగా చూస్తున్నారా. సకాలంలో వైద్య సేవలు అందుతున్నాయా అని ఆరా తీశారు. అలాగే ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? వారికి షిఫ్ట్ లు ఏ విధంగా కేటాయిస్తారు, నైట్ డ్యూటీ లో, అత్యవసర సమయాల్లో డాక్టర్లు అందుబాటులో ఉంటారా అని కలెక్టర్ ఆసుపత్రి సూపరిoటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ చాలా మంది రోగులు ఉన్నారు. ప్రత్యామ్నాయం లేదా అని ఆసుపత్రి సూపరిoటెండెంట్ ను అడగ్గా 20 పడకలతో కూడిన నూతన క్యాజువాలిటీ ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆ గదిని చూపించారు. ఆలస్యం లేకుండా వెంటనే నూతన క్యాజువాలిటీ ని ప్రారంభించాలని కలెక్టర్ మునిసిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
అనంతరం ఏఎంసీలో ఉన్న క్రిటికల్ కేర్ పేషెంట్స్ తో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం డయోగ్నస్టిక్ బ్లాక్ కు వెళ్లారు. హాస్పిటల్ కు వివిధ రకాల రోగాలకు సంబంధించి రోగులు ఒకే చోటకు వస్తున్నారని, విజయవాడ, వైజాగ్ ప్రాంతాల తరహాలో ఈ ఎన్ టి ఆసుపత్రి, మానసిక వైద్యం..ఇలా ఆస్పత్రులను విడి విడిగా ఏర్పాటు చేస్తే రోగులకు సౌకర్యవంతంగా ఉంటుందని, ఇందుకు వీలవుతుందేమోనని పరిశీలించాలని ఆసుపత్రి సూపరిండెంట్ ను ఆదేశించారు.
అనంతరం వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తూ సిటి స్కాన్, అల్ట్రా సౌండ్ గదులు ఎన్ని ఉన్నాయనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.. సీటీ స్కాన్లు రెండు పనిచేస్తున్నాయని, మరో సిటి స్కాన్ గ్రీన్ కో ఎనర్జీ వారు అందజేస్తున్నారనే విషయాన్ని ఆసుపత్రి సూపరిండెంట్ వివరించారు..ఎక్స్ రే పరికరాలు అన్ని అందుబాటులో ఉన్నాయని, ఎక్స్ రే పరికరాల వల్ల విద్యుత్ వినియోగం ఎక్కువైతుందని , ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయించాలని సంబంధిత హెచ్ఓడి కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా ట్రాన్స్ఫార్మర్ వెంటనే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపిఎంఎస్ఐడీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం రక్త నిధి కేంద్రాన్ని పరిశీలిస్తూ బ్లడ్ బ్యాంకులో రక్తదానం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని, ఎవరైనా రక్తదానం చేయాలని వస్తే,వారు 15 నిమిషాలలో రక్తం ఇచ్చి వెళ్లిపోయే విధంగా ఫెసిలిటేట్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. అదేవిధంగా తరచుగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని, రక్త నిధి కేంద్రంలో రక్తం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గైనిక్ బ్లాక్ లోని యాంటీనేటల్ గదిని పరిశీలిస్తూ వైద్యం ఏ విధంగా అందిస్తున్నారు? ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని సదుపాయాలు అందుతున్నాయా? లేదా? అని గర్భిణీ స్త్రీలను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు.. ఇక్కడ రోగులు ఎక్కువగా ఉన్నారని, గైనిక్ వార్డులో 220 పడకల నుండి 300 పడకల పెంపుకు తగిన ప్రతిపాదన సిద్ధం చేయాలని కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. అనంతరం పీడియాట్రిక్ వార్డ్ లో అతిసార వ్యాధితో చికిత్స పొందుతున్న మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామానికి చెందిన అంజలి కుమారుడు అభిరామ్, గీత కుమారుడు ధనుష్ లను కలెక్టర్ పరామర్శిస్తూ, వైద్యం ఏ విధంగా అందిస్తున్నారు, ఇప్పుడు అబ్బాయి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందని బాధిత తల్లులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. అనంతరం నవజాత శిశువుల వార్డును కలెక్టర్ పరిశీలిస్తూ అప్పుడే పుట్టిన చిన్నారులకు వైద్య చికిత్సలు ఏ విధంగా అందిస్తున్నారని వారి తల్లులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు..పీడియాట్రిక్ బ్లాక్లో ఏర్పాటు చేసిన వైద్య పరికరాలు బాగున్నాయని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల మెయిన్ గేటు ముందు డ్రైనేజీ క్లీనింగ్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ కి సూచించారు.
ఆసుపత్రి అభివృద్ధికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని, ఇంకా అదనంగా ఏమైనా అవసరమైతే ప్రతిపాదనలు తీసుకువస్తే సిఎస్ఆర్ నిధుల ద్వారా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అధికారులకు సూచించారు.. మిగిలిన బ్లాక్ ను మళ్ళీ విజిట్ చేస్తామని, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆసుపత్రి లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, డిఎమ్ హెచ్ఓ డా.ప్రవీణ్ కుమార్, కర్నూలు ఆర్డీఓ శేషి రెడ్డి, సంబంధిత వైద్య విభాగాల హెచ్ఓడిలు, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.