శంకుస్థాపన చేసి నిర్లక్ష్యం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం
• శంకుస్థాపన చేసి నిర్లక్ష్యం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం
• కడప ఉక్కు కర్మాగారాన్ని తక్షణమే నిర్మించాలి
• రాయలసీమ ఐక్య విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షులు, జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు
కర్నూలు కలెక్టరేట్, మార్చి 14, ( సీమకిరణం న్యూస్) :
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను వెంటనే పూర్తి చేయాలని రాయలసీమ ఐక్య విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షులు, జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య గారికి వారి కార్యాలయం నందు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం కరువు, వలసలు, రైతుల ఆత్మహత్యలకు నిలయంగా మారిందని, ఇలాంటి రాయలసీమ ప్రాంతంలోని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను స్థాపించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. గత కేంద్ర ప్రభుత్వం విభజన సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా కడప ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తామని ప్రకటించడం జరిగిందన్నారు. 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా మేము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సర కాలంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను నిర్మిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గారు తిరుపతిలో వెంకన్న సాక్షిగా హామీ ఇవ్వడం జరిగిందని గుర్తుకు చేశారు. కడప జిల్లాలో కడప ఉక్కు రాయలసీమ హక్కు నినాదంతో కడప ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాలలో అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలతో పోరాటం చేయడం జరిగిందన్నారు. ఉక్కు ఉద్యమాల ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసినప్పటికీ పనులను ప్రరంభించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఉక్కు పరిశ్రమ పూర్తయితే ప్రత్యక్షంగా పదివేల మంది నిరుద్యోగులకు, పరోక్షంగా 20,000 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉక్కు పరిశ్రమ పనులు వెంటనే పూర్తి చేయడానికి తగినన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నాయకులు వీరేంద్ర, రవి, జెట్టప్ప తదితరులు పాల్గోన్నారు.