కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విక్రాంత్ పాటిల్
* శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకుంటాం
* ప్రజలకు సేవలందించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాం
* ఎక్కడైనా సమస్యలుంటే సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటాం
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైమ్, ఫిబ్రవరి 01, (సీమకిరణం న్యూస్):
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీలలో భాగంగా ఇంతకుమునుపు కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేసిన జి. బిందు మాధవ్ కాకినాడ జిల్లా ఎస్పీగా బదిలీ కావడంతో ఆ స్థానంలో విక్రాంత్ పాటిల్ కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా జల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
మొదటగా ఏఆర్ సిబ్బందిచే గౌరవవందనం స్వీకరించారు.
బాధ్యతలు స్వీకరించిన విక్రాంత్ పాటిల్ కి పూరోహితులు ఆశీస్సులు అందజేశారు.
అనంతరం డిపిఓ లోని వ్యాస్ ఆడిటోరియంలో మిడియాతో
జిల్లా ఎస్పీ మాట్లాడారు.
శనివారం కర్నూలు జిల్లా ఎస్పీగా భాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి, రాష్ట్ర డిజిపికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
కర్నూలు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పటిష్ట చర్యలు చేపడతామన్నారు. మహిళలు, చిన్న పిల్లల పట్ల జరిగే నేరాల పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
ఇటీవల కాలంలో జరుగుతున్న సైబర్ నేరాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్ నేరాలు చేధించడం, కట్టడితో పాటు , సైబర్ నేరాల నివారణకు అవగాహన చర్యలు తీసుకుంటామన్నారు.
డిజిటల్ అరెస్టు, ఆధార్ కార్డు నెంబర్ తో మోసాలు , క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామనే సైబర్ మోసాల పట్ల ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తామన్నారు. కళాశాల , పాఠశాలల అధ్యాపకులు, మహిళ పోలీసులు, మీడియా ద్వారా సైబర్ మోసాల విడియో క్లిప్పింగ్స్ తో ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. పోక్సో చట్టం గురించి విద్యార్ధులకు తెలియజేస్తామన్నారు.
ప్రజలకు సేవలందించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామన్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నేర రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి గ్రామంలో, పట్టణంలో సిఎస్ ఆర్ నిధులతో సిసి కెమెరాల నిఘాను పెంచుతామన్నారు.
ఏ చిన్న పాటి సంఘటన జరిగిన కేసులు ఛేదించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలకంగా పని చేస్తాయన్నారు.
నేరాల నివారణలో జిల్లా పోలీసుశాఖకు జిల్లా ప్రజలు మరియు మీడియా వారు తమ వంతు సహాకారం అందించాలని కోరుకుంటున్నామన్నారు.
అనంతరం జిల్లా పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ సమావేశం నిర్వహించారు.
పలు సూచనలు చేసి దిశా నిర్ధేశం చేశారు. నేరాల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.
విక్రాంత్ పాటిల్ గారి గురించి…
విక్రాంత్ పాటిల్ 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తమిళనాడు రాష్ట్రం కేడర్ కు ఎంపికైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ అయ్యారు. 2016 లో తుళ్లూరులో ఎఎస్పీ గా, 2017 లో పార్వతీపురం ఓఎస్టీగా పనిచేసి ఎస్పీగా పదోన్నతి పొందారు.
2018లో చిత్తూరు జిల్లా ఎస్పీగా , ఆ తర్వాత 2019 లో విశాఖపట్నం డీసీపీగా , గుంతకల్లు రైల్వే ఎస్పీగా, విజయవాడ డీసీపీగా, 2021 లో విజయనగరం 5 వ ఎపిఎస్పీ బెటాలియన్, 2023లో పార్వతీపురం మన్యం ఎస్పీగా పనిచేశారు.
2024 లో ఎపిఎస్పీ 3 వ బెటాలియన్ కాకినాడ కమాండెంట్ గా , ఆ తర్వాత కాకినాడ జిల్లా ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం బదిలీపై కర్నూలు జిల్లాకు వచ్చారు.
సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్, డిస్పీలు , సిఐలు, ఆర్ ఐలు, ఎస్సైలు, ఆర్ ఎస్సైలు, డిపిఓ సిబ్బంది నూతన జిల్లా ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు, పుష్ఫగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.