
ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడదాం
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు ప్రతినిధి, జూన్ 05, (సీమకిరణం న్యూస్)
ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పిలుపు ఇచ్చారు. గురువారం ఉదయం సునయన ఆడిటోరియంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవలసిన అవసరం ఉందని తెలిపారు..అదే విధంగా కాలుష్యాన్ని నివారించడం, పర్యావరణ సమతుల్యతను నిర్వహించడం లక్ష్యాలుగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.. 1972 వ సంవత్సరం లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం ప్రకారం జూన్ 5 వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రకటించడం జరిగిందన్నారు.. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా ప్రతి సంవత్సరం ఒక థీమ్ ను నిర్దేశించుకుని, ఆ థీమ్ ను అమలు చేయడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది “ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం” అనే థీమ్ తో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో కృషి జరుగుతోందని, ఇందులో మనమందరం భాగస్వాములు కావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని, అందువల్ల ప్లాస్టిక్ ని తమ జీవన శైలి నుండి నిషేధించుకోవడం చాలా అవసరమని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా భారతదేశంలో ప్లాస్టిక్ వాడకం జరుగుతోందని, 1/5 వంతు ప్లాస్టిక్ వస్తువులను దాదాపు 9.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వస్తువులు ఉంటున్నాయని తెలిపారు. దీనిని నివారించే చర్యలు మనం కూడా చేపట్టాలని కోరారు. సముద్రం లో వేల కోట్ల మిలియన్ టన్నుల్లో ప్లాస్టిక్ చేరిపోయిందని, అలాగే భూమి పొరల్లో కూడా చేరిపోయిందని, అందువల్ల నీటి కాలుష్యం తో పాటు భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నాయన్నారు.. సముద్రం, భూమి కాకుండా చివరకు మన శరీరంలో కూడా ప్లాస్టిక్ చేరిపోయి వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులు రావడానికి కారణం అవుతోందన్నారు..ఇది ఇలాగే కొనసాగిస్తే సహజ వనరులు పూర్తిగా దెబ్బ తినే అవకాశం ఉందని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు.. ఇప్పటికైనా మనం మేల్కొనవలసిన అవసరం ఉందన్నారు..కావున మనం ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు..ప్లాస్టిక్ కు బదులుగా పునర్వినియోగించే వస్తువులను వాడాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ సమతుల్యత కోసం విరివిగా చెట్లను పెంపకం చేయాల్సిన అవసరం ఉందన్నారు…మానవుడు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు చెట్ల అవసరం ఉంటుందని, కావున ప్రతి ఒక్కరూ బద్ధకం వీడి చెట్ల పెంపకాన్ని చేపట్టాలని కలెక్టర్ కోరారు. భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణం అందించేలా మనందరం చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కృషి చేద్దామని కలెక్టర్ పిలుపు ఇచ్చారు. కర్నూలు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణం కు ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ ప్రజలు తమ ఇంటిలోని వ్యర్థాలను ఇంటి బయట కాలువల్లో వేస్తున్నారని, ఇందువల్ల నీటి ప్రవాహం ఆగిపోయి దోమలు పెరిగి, ప్రజల అనారోగ్యనికి కారణమవుతోందని తెలిపారు.. కావున ప్రజలు కాలుష్య నివారణకు తగిన సహకారం అందించాలని కోరారు..తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ కార్మికులకు అందజేయాలని కోరారు. ప్రమాదకరమైన వ్యర్థాలను విడిగా అందజేయాలని కోరారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎస్ ఈ శంకర్ నాయక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు జిల్లా యంత్రాంగం గత వారం రోజులు నుండి అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు పూర్తి అవగాహన కల్పించే చర్యలు చేపట్టామని తెలియజేశారు. పర్యావరణానికి నష్టం కలిగించే వస్తువులతో, స్లోగన్లతో విద్యార్థులు అనేక వేషధారణ లతో అవగాహన కల్పించారు. పర్యావరణం పరిరక్షణ చేయాలన్న సందేశంతో కళాజాతల ద్వారా, పాటలు, నృత్యాల ద్వారా చైతన్యం కలిగించారు. ఈ సమావేశంలో కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్,ఎస్ ఈ పి సి బి శంకర్ నాయక్ ,పి సి బి ఈ ఈ శంకర్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు,డి ఆర్ డి ఏ పిడి రమణారెడ్డి, ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి ,జిల్లా సైన్స్ అధికారి రంగమ్మ , విద్యార్థులు , స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, ఎన్ సి సి సభ్యులు పాల్గొన్నారు. అంతకు ముందు పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు.. పర్యావరణ పరిరక్షణ కు అందరూ కృషిచేయాలని జేసీ ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు.