
సీఎం లంచాలు తీసుకున్నారు విచారించండి: డీజీపీకి ఈడీ లేఖ
తమిళనాడులో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను విచారించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా తమిళనాడు డీజీపీకి లేఖ రాసింది. ఈ లేఖకు 232 పేజీల నివేదికను కూడా జత చేసింది. సీఎంతో పాటు మంత్రి నెహ్రూ, ఆయన సెక్రటరీలు, సోదరుడిని కూడా విచారించాలని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో తీవ్ర రాజకీయ అలజడి రేగింది.
ఎన్నికల నేపథ్యంలో తమను ఇబ్బంది పెట్టేందుకే ఈడీ ఇలా చేస్తోందని అధికార పార్టీ డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, దీనిని బీజేపీ నాయకులు స్వాగతించారు. అవినీతి, అక్రమాలు ఎవరు చేసినా కేంద్రంలోని మోడీ సర్కారు చూస్తూ ఊరుకోదని వ్యాఖ్యానించారు.
అసలు ఏం జరిగింది?
తమిళనాడులోని మునిసిపల్ శాఖ కొన్నాళ్ల కిందట 2,538 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం పలు దఫాలుగా పరీక్షలు నిర్వహించి ఉద్యోగులను ఎంపిక చేసింది. రెండు నెలల కిందట సీఎం స్టాలిన్ వారికి నియామక పత్రాలు కూడా అందించారు.
ఇక్కడితో కథ అయిపోయిందనుకున్నా, ఈడీ రంగ ప్రవేశం ఇక్కడి నుంచే మొదలైంది. ఈ ఉద్యోగాల భర్తీలో 1,000 కోట్ల రూపాయల మేరకు లంచాలు ఇచ్చి తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఒక్కో అభ్యర్థి నుంచి 25 లక్షల నుంచి 30 లక్షల వరకు తీసుకుని ఉద్యోగాలకు ఎంపిక చేశారన్నది ఈడీ వాదన.
అంతేకాదు, దీనిలో పెద్ద నేతల ప్రమేయం ఉందని, ఆ నిధులు వారి ఖాతాలకు బదిలీ అయ్యాయని కూడా పేర్కొంది. ఈ అంశం రాష్ట్రంలో గత కొన్నాళ్లుగా రాజకీయ దుమారం రేపుతోంది.
ఈ వ్యవహారంపై డీఎంకే నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. స్థానికంగా వచ్చిన వివాదాలు, అభ్యర్థుల ఫిర్యాదులపై ప్రత్యేక దర్యాప్తు బృందం నియమించామని తెలిపింది. కానీ తమను సంప్రదించకుండానే ఈడీ రాష్ట్రంలో దర్యాప్తు చేస్తోందని ఆ పార్టీ పేర్కొంది. ఈడీని నిలువరించాలని కోరింది.
ఈ పిటిషన్పై విచారణ చేసిన సుప్రీం కోర్టు ఈడీపై తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు ఉన్నప్పుడు మీరు జోక్యం చేసుకోవడం ఎలా అని నిలదీసింది. చివరకు సుప్రీం కోర్టు ఈడీ ప్రమేయాన్ని నిలువరించింది.
ఇప్పుడు, ఈ నేపథ్యంలోనే ఈడీ తాము ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు వివరాలతో పాటు మంత్రి నెహ్రూ, ఆయన సెక్రటరీలు, సోదరుడి ప్రమేయం మరియు సీఎం స్టాలిన్ స్వయంగా జోక్యం చేసుకున్న తీరును వివరిస్తూ 232 పేజీల నివేదికను డీజీపీకి పంపింది.
సీఎం స్టాలిన్పై విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని తక్షణం అరెస్టు చేయాలని సూచించింది. అయితే, ఇది రాజకీయ వ్యూహంలో భాగంగా తమనే వేధించడమేనని స్టాలిన్ చెబుతున్నారు. బీజేపీ, అన్నాడీఎంకే (బీజేపీ మిత్రపక్షం) మాత్రం ఈడీ లేఖను సమర్థిస్తూ డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




