క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి

క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైమ్, డిసెంబర్ 24, (సీమకిరణం న్యూస్):
క్రిస్మస్, న్యూ ఇయర్ నేపథ్యంలో భద్రతకు సంబంధించిన అంశాల పై కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 31 వేడుకల్లో ప్రధాన కూడళ్లలో డ్రంకెన్ డ్రైవ్, ఆకస్మిక తనిఖీలతోపాటు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించారు. వేడుకల నేపథ్యంలో కొందరు ఆకతాయిలు రోడ్ల పై హంగామా చేసి ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదన్నారు. న్యూ ఇయర్ స్వాగతపు వేడుకలను ఆనందంగా జరుపుకోవాలన్నారు. మద్యం సేవించి అత్యుత్సాహంతో హద్దు మీరి, చట్టపరమైన కష్టాలను తెచ్చుకోవద్దన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. వేడుకలను కుటుంబ సమేతంగా, ఇళ్లలో సంతోషంగా నిర్వహించుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్, ర్యాష్ డ్రైవింగ్ , రాంగ్ రూట్ డ్రైవింగ్, రోడ్లుపై వెళ్ళేవారిని ఇబ్బందికి గురి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైలెన్సర్లు తీసి ద్విచక్ర వాహనాలు నడపడం చేస్తూ శబ్ద కాలుష్యం చేసే వారి పై కఠినంగా వ్యవహరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే యువకులకు హెల్మెట్ లేకుండా బయటకు పంపించరాదని, లైసెన్సులు లేని మైనర్లకు వాహనాలు ఇచ్చి బయటకు పంపించి తల్లిదండ్రులు ఇబ్బందులు పడవద్దన్నారు. రహదారి భద్రత నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు ప్రమాదాల బారిన పడవద్దన్నారు. ఆయా కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు హాస్టల్స్ లలో ఉంటున్న విద్యార్దుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలీసు అధికారులకు, జిల్లా ప్రజలకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఆనందంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని, చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.




