” జగనన్న గోరుముద్ద ” పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి

విద్యార్థులతో కూర్చొని..‘జగనన్న గోరుముద్ద’ రుచి చూసిన జిల్లా కలెక్టర్ :-
మెనూ ప్రకారం రుచికరమైన ” జగనన్న గోరుముద్ద ” పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి :-
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు :-
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ ప్రకారం రుచికరమైన ” జగనన్న గోరుముద్ద ” పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు సంబందిత అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం కల్లూరు మండలం, చిన్నటేకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకం అమలును జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. జగనన్న గోరుముద్ద పథకం క్రింద విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలన చేయాలని నిశ్చయించుకొని విద్యార్థులతో విద్యార్థిగా మారి బెంచిపైన కూర్చుంటూ చిన్నారులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో భోజనం రుచిగా ఉంటుందా… కడుపునిండా పెడుతున్నారా…నేను పాఠశాలకు వస్తున్నానని తెలిసి బాగా వండారా…రోజు ఇలాగే ఉంటుందా… ముచ్చటిస్తూ రోజువారీ మధ్యాహ్న భోజన ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు అందించే భోజనం నాణ్యతగా, రుచికరంగా ఉండటంతో జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే చిన్నారుల భవిష్యత్తుకు పలు సూచనలు చేశారు. చక్కగా చదువుకోవాలని, ఆనందంగా హాయిగా జీవితం గడపాలని, దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆయన ఆకాంక్షను తెలియజేశారు. బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. రుచి కరమైన, నాణ్యమైన భోజనం అందిస్తేనే విద్యార్థులు ఆరోగ్యకరంగా ఉంటారని ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ సూచించారు. పిల్లలకు పెట్టె భోజన సమయంలో పాత్రలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. మన ఇంట్లో ఏవిధంగా భోజనాన్ని వండుకుంటామో అదే విధంగా పాఠశాలల్లో కూడా భోజనాన్ని వండి పిల్లలకు పెట్టాలని వంట ఏజెన్సీ, ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఏ చిన్న పొరపాటు జరిగినా దాని ప్రభావం విపరీత ధోరణిలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పిల్లలకు చిన్నతనం నుంచి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడానికి, పాఠశాలల్లో హాజరును మెరుగుపరచడానికి మధ్యాహ్నం భోజన పథకం యొక్క మెనూని మార్చేశారని అన్నారు. అనంతరం పాఠశాలలో ఉన్న ఆర్వో ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కుకింగ్ ఏజెన్సీలు జగనన్న గోరుముద్ద వంటకాన్ని ఎలా వండుతున్నారు, ఏ విధంగా వండుతున్నారు, భోజనం వండే సమయంలో ప్రతి రోజూ పాఠశాల తల్లుల కమిటీ సభ్యులు జగనన్న గోరుముద్దను పర్యవేక్షించి విద్యార్థులకు మరింత రుచికరమైన, శుచికరమైన పౌష్టిక ఆహారం అందేలా పర్యవేక్షించాలన్నారు. పాఠశాల విద్యా కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి పాఠశాల అభివృద్ధికి పలు సలహాలు, సూచనలు తీసుకోవాలని ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గారి వెంట డీఈఓ రంగారెడ్డి, గ్రామ సర్పంచి లక్ష్మన్న, ఎంఈఓ శ్రీనివాసులు, కల్లూరు మండల తహసిల్దార్ రమేష్ బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున శెట్టి విద్యా కమిటీ చైర్మన్ చంద్రశేఖర్, సభ్యులు సురేష్, సురేఖ తదితరులు పాల్గొన్నారు.