
విద్యుత్ పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించండి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు ప్రతినిధి, డిసెంబర్ 15, (సీమకిరణం న్యూస్) :
జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ వాడకంలో పొదుపుపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ఇంధన పరిరక్షణ మరియు సంరక్షణ” కి సంబంధించిన వారోత్సవాల పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు..ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంధన పొదుపు వారోత్సవాలు ఈ నెల 14 నుండి 20 వ తేదీ వరకు నిర్వహించనున్నారని తెలిపారు..రోజు రోజుకు విద్యుత్ వాడకం అధికం అవుతున్న నేపథ్యంలో విద్యుత్ వృధా కాకుండా ఆదా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.. విద్యుత్ ను సమర్థవంతంగా వినియోగించుకునేలా విద్యుత్ వాడకంపై అవగాహన కల్పించాలన్నారు..పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన,వక్తృత్వపు పోటీలు, కళాశాల విద్యార్థులకు వర్క్ షాపులు నిర్వహించి విద్యుత్ సంరక్షణ పై అవగాహన కల్పించాలన్నారు.. మహిళా సంఘాలు,ఇతర వినియోగదారులకు, రైతులకు విద్యుత్ పొదుపు ఆవశ్యకత, సమర్థవంతంగా వినియోగించుకోవడంపై వివరించాలన్నారు. వినియోగదారులకు కరపత్రాలను పంపిణీ చేసి విద్యుత్ ఆదా గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఏపీఎస్పీడిసిఎల్ ఎస్ఈ ప్రదీప్, డిఆర్ఓ సి.వెంకటనారాయణమ్మ, ఏపీఎస్పీడిసిఎల్ DE,AE లు పాల్గొన్నారు.




